న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం వరకు కాంగ్రెస్ పార్టీలో 19 ఏండ్లుగా కీలకంగా వ్యవహరించిన గ్వాలియర్ సంస్థాన వారసుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం నరేంద్రమోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
గ్వాలియర్ సంస్థాన వారసుడు మాధవరావు సింధియా తనయుడు జ్యోతిరాదిత్య సింధియా.. తండ్రీ కొడుకులిద్దరూ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయ నేతలుగా ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి గుణ స్థానం నుంచి ఓటమి పాలైన జ్యోతిరాదిత్య పునరాలోచించుకున్నారు.
22 మంది మద్దతుదారులైన తన ఎమ్మెల్యేలతో బీజేపీ కండువా కప్పుకున్నారు జ్యోతిరాదిత్య. దీంతో 2018 చివరిలో కొలువు దీరిన కమల్నాథ్ సర్కార్ మధ్యలోనే కూలిపోయింది. ఆ వెంటనే శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరించారు.
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినందుకు ప్రతిగా గతేడాది ఆయనను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది బీజేపీ. తాజాగా కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన జ్యోతిరాదిత్య.. బీజేపీలో చేరే వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు.
బీజేపీలో చేరడానికి ముందు రాహుల్ గాంధీలో విమర్శలు గుప్పించారు జ్యోతిరాదిత్య. పార్లమెంట్లో ఎల్లప్పుడూ వెనుక బెంచిలకు మాత్రమే రాహుల్ పరిమితం అయ్యేవారని విమర్శలు చేశారు. కొన్ని రోజులుగా రాహుల్తో భేటీకి ప్రయత్నిస్తున్నా.. అవకాశం ఇవ్వలేదంటూ ఆరోపణలు గుప్పించారు.
కానీ ఒకనాటి తన సన్నిహితుడు జ్యోతిరాదిత్య విమర్శలకు రాహుల్ సున్నితంగానే సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా తనను కలుసుకునే సన్నిహిత నేత జ్యోతిరాదిత్య అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రతిభకు విలువ లేదని జ్యోతిరాదిత్య ఆరోపించారు. మాధవరావు సింధియా మరణం తర్వాత గుణ నుంచి లోక్సభకు ఎన్నికైన జూనియర్ సింధియా.. మన్మోహన్ సింగ్ సర్కార్లో మంత్రిగా సేవలందించారు.
2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు. ఓల్డ్ బ్రిగేడ్గా పేరొందిన కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్లతో కలిసి పని చేశారు. సీఎం పదవిని చేపట్టాలని ఆయన కన్న కలలను కాంగ్రెస్ అధిష్ఠానం సాకారం చేయలేదు.
తర్వాత మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడి బాధ్యత చేపట్టాలని ఆశించారు. కానీ అప్పటికీ సీఎంగా ఉన్న కమల్నాథ్నే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వం కోసం జ్యోతిరాదిత్య సింధియా చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోయింది.