న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నూతన చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్ కమిటీ ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఎంపిక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు.
కాగా, జస్టిస్ అరుణ్ మిశ్రాతోపాటు పరిశీలనకు వచ్చిన ఇతర పేర్లలో జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేష్ మిట్టల్ కుమార్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ రాజీవ్ జైన్ కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్లో పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి NHRC చైర్మన్ ఎంపిక జరుగలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం NHRC తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి 2020 సెప్టెంబర్ 2న రిటైర్ అయ్యారు.