న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. వైరస్ పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సైతం హాజరవనున్నారు. సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో వైరస్ పరిస్థితిపై సమీక్షించనున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ప్రజలకు సహాయం చేయడానికి పలు సలహాలు, సూచనలు చేయనుంది.
మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, బిహార్ సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్ల ఎగుమతిపై తక్షణ తాత్కాలిక నిషేధం విధించాలని, ఇతర వ్యాక్సిన్లకు ఫాస్ట్ట్రాక్ అనుమతి ఇవ్వాలని, అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో కేవలంలో ఒకే శాతం మందికి వ్యాక్సిన్లు వేయగలిగారని, 75శాతం మంది ప్రజలకు టీకాలు వేసేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అని ప్రశ్నించారు.
రెండో దశ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, విపత్తు కలిగిస్తుందని.. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం నుంచి ఏప్రిల్ వరకు రాజస్థాన్లోని తొమ్మిది నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. అజ్మీర్, అల్వార్, భిల్వారా, చిత్తోర్గఢ్, దుంగార్పూర్, జైపూర్, జోధ్పూర్, కోటా, అబూలో నైట్ కర్ఫ్యూ అమలుకానుంది.