లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘జంగిల్ రాజ్’ నడుస్తున్నదని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. బ్లాక్ పంచాయతీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానంపై మండిపడుతూ ట్వీట్ చేశారు. ”బీజేపీ పాలనలో చట్టాలేమీ లేవు. కేవలం జంగిల్ రాజ్ నడుస్తున్నది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. లఖింపూర్లో ఓ మహిళ చీర లాగి, అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. దాంతో పోటీలో ఉన్న వివిధ పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అందరిలాగే పాస్గవాన్ బ్లాక్ నుంచి ఎస్పీ నాయకురాలు రీతూ సింగ్ అనే మహిళ కూడా నామినేషన్ వేయడానికి బయల్దేరారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆమెను అడ్డగించి చీర లాగారు. నామినేషన్ పత్రాలను కూడా చించి పారేశారు. దీంతో రీతూ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.