డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళా ముగిసినట్లు జునా అఖారా చీఫ్ స్వామి అవదేషానంద్ గిరి తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న కుంభమేళాను విరమించుకున్నట్లు చెప్పారు. దేశ ప్రజలు, వారి మనుగడే సాధువులకు ముఖ్యమని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో కుంభం నుండి తీసిన దేవతలందరినీ నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. పవిత్ర స్నానాలన్నీ ముగిశాయని, కేవలం బైరాగిల స్నానాలు మిగిలి ఉన్నాయన్నారు. షాహి స్నాన్ కోసం పెద్ద సంఖ్యలో రావద్దని భక్తులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో వ`ద్ధులు, పిల్లలు దీనికి దూరంగా ఉండాలని సూచించారు.
ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభమైన కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో చాలా మంది కరోనా భారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జునా అఖారా చీఫ్ స్వామి గిరితోపాటు ఆచార్య మహమండలేశ్వర్తో మాట్లాడారు. కరోనా సోకిన సాధువుల ఆరోగ్యాన్ని ఆరా తీశారు. మహమ్మారి కారణంగా సమూహాలకు బదులు మత ప్రతీకగా కుంభమేళాలో పాల్గొనేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో తమపరంగా కుంభమేళా కత్రువులను ముగించినట్లు స్వామి గిరి వెల్లడించారు.