పుణె: కాలం మారుతున్నా కొద్ది యుద్ధ స్వభావం మారుతూ వస్తున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాలు పరస్పర సహకారంతో, సమష్టి తత్వంతో పని చేయాలని భారత నావికాదళం చీఫ్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ అభిప్రాయపడ్డారు. శనివారం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) 140వ కోర్సు పాసింగ్ అవుట్ పెరేడ్ను సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు.
భూమి, సముద్రం, గాలి, అంతరిక్షం, సైబర్ స్పేస్ వంటి వాటన్నిటిలోనూ ప్రత్యర్థులను ఎదుర్కోవడం ముఖ్యమని నేవీ చీఫ్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాలు కలిసికట్టుగా, సమష్టితత్వంతో పని చేయవలసిన అవసరం ఉందన్నారు. మన దేశ రక్షణ రంగంలో చాలా ముఖ్యమైన సంస్కరణలు జరుగుతున్నట్లు తెలిపారు. మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవస్థ ఏర్పాటు లాంటివి అందుకు నిదర్శనమని చెప్పారు.
భవిష్యత్తులో యుద్ధం ఏవిధంగా ఉంటుందనే దానితో సంబంధం లేకుండా సమర్థ నాయకత్వానికి కొన్ని వ్యక్తిగత సామర్థ్యాలు, ఆకర్షణలు చాలా ముఖ్యమైనవనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం నాయకత్వ లక్షణమని చెప్పారు.