న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) సంస్థ ఇండియాలో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వర్గాలు వెల్లడించాయి. అయితే దరఖాస్తు ఉపసంహరణకు గల కారణాన్ని జే&జే వెల్లడించలేదు. తన జాన్సెన్ కొవిడ్ వ్యాక్సిన్ కోసం గత ఏప్రిల్లో ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. అంతేకాదు జులైలోనే కొన్ని వేల డోసుల వ్యాక్సిన్లు వస్తాయన్న వార్తలూ వచ్చాయి.
అమెరికా ఈ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్కు గత ఫిబ్రవరిలోనే అనుమతి ఇచ్చింది. అయితే ఆ వెంటనే ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకడుతోందన్న వార్తలు వచ్చాయి. ఇటు యూరప్లోనూ నాఢీ సంబంధిత సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అయితే తమ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్తోపాటు అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.