న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ ( Single Dose Covid Vaccine ) అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ జాన్సెన్ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ సంస్థ ఇండియాలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండా నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీంతో పాత దరఖాస్తును ఉపసంహరించుకున్న జే అండ్ జే సంస్థ.. తాజాగా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. గురువారమే అప్లై చేసుకున్నట్లు ఆ సంస్థ శుక్రవారం వెల్లడించింది. ఇండియా ప్రజలకు తమ సింగిల్ డోసు వ్యాక్సిన్ అందించే దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ. లిమిటెడ్ సంస్థతో జే అండ్ జే చేతులు కలిపింది. ఇప్పటికే అమెరికాకు చెందిన మోడెర్నాకు భారత్ అనుమతించిన విషయం తెలిసిందే.