లక్నో : ఇంటి ముందు కూరగాయలు అమ్ముకుంటున్న ఓ బాలుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కరోనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అతడిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉన్నావ్ జిల్లాలోని బంగారమౌ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల దెబ్బలకు బాలుడు స్పృహ కోల్పోయాడు. దీంతో అతన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని నిరసన చేపట్టారు. బాలుడి మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాలుడిని చితకబాదిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతో పాటు ఒక హోంగార్డును సస్పెండ్ చేశారు. యూపీలో కరోనా కర్ఫ్యూ మే 24 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉండనుంది.