ఇబ్రహీంపట్నంలో పెట్టుబడుల వరద పారుతున్నది. ఇప్పటికే ఇదే ప్రాంతంలో ఆరు ఎరోస్పేస్ సంస్థలు ఉండగా.. ఎలిమినేడులో మరో సంస్థను ఏర్పాటు చేయనున్నారు. భూముల సేకరణ దాదాపుగా పూర్తికాగా.. మరో వారం రోజుల్లో పూర్థి స్థాయిలో రైతులకు పరిహారం అందనున్నది. అయితే ఇబ్రహీంపట్నంను ఇంటర్నేషల్ ఎరోస్పేస్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. అంతేకాకుండా కాంపోజిట్ పార్కును సైతం ఏర్పాటు చేస్తున్నది.
ఇబ్రహీంపట్నం, మార్చి 23 : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఇంటర్నేషల్ ఎరోస్పేస్ హబ్గా రూపాంతరం చెందుతున్నది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ఆదిబట్ల మున్సిపాలిటీలో రెండు ఎరోస్పేస్ సంస్థలు ఏర్పాటుకాగా.. వీటికితోడు త్వరలోనే ఎలిమినేడు గ్రామంలో మరో ఎరోస్పేస్ సంస్థ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో మరిన్ని ఎరోస్పేస్ అనుబంధ సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేడులో ఇప్పటివరకు ఆదిబట్లలో ఉన్న ఎరోస్పేస్ సంస్థకు ధీటుగా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఐటీపురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించడంతో.. ఎలిమినేడు ఎరోస్పేస్ పనుల్లో వేగం పుంజుకుంది.
ఎరోస్పేస్కు కేంద్రబిందువు ఇబ్రహీంపట్నం
ఎరోస్పేస్ సంస్థలకు ఇబ్రహీంపట్నం కేంద్ర బిందువుగా మారుతున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్లో హెలికాప్టర్ క్యాబిన్ తయారీ చేస్తున్నారు. ఈ సంస్థలో తయారయ్యే హెలికాప్టర్ క్యాబిన్లను రక్షణరంగ సంస్థలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అలాగే, ఆదిబట్లలో మరో ఎరోస్పేస్ సంస్థ టాటా మార్టిన్లాకిడ్ కూడా ఏర్పాటైంది. ఇందులో హెలికాప్టర్ విడిభాగాల తయారీ కొనసాగుతుంది. వీటికి ధీటుగా పక్కనే ఎలిమినేడు గ్రామంలో మరో భారీ ఎరోస్పేస్ సంస్థను ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్కు అతిసమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరిన్ని ఎరోస్పేస్ సంస్థలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఇంటర్నేషల్ ఎరోస్పేస్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆదిబట్లలో ఉన్న ఎరోస్పేస్ సెజ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. జీఎంఆర్ ఎయిర్పోర్టులో ప్రత్యేకంగా ఎరోస్పేస్ పార్కు భూమిని కూడా నోటిఫై చేశారు. దీంతో ఈ ప్రాంతం ఎరోస్పేస్ రంగానికి కేంద్ర బిందువు కానున్నది.
ఎలిమినేడులో మరో భారీ ఎరోస్పేస్ సంస్థ..
ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో మరో ఎరోస్పేస్ సంస్థ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలిమినేడు గ్రామంలో సర్వేనంబర్ 166లో 103ఎకరాలు, సర్వేనంబర్ 421లో 176.22ఎకరాలు, సర్వేనంబర్ 512లో 376ఎకరాలు ఈ సంస్థ ఏర్పాటుకోసం గుర్తించారు. ఇందులో 378ఎకరాలు ప్రభుత్వ భూమికాగా, ఈ భూమిని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంది. అలాగే, మిగతా భూమి పట్టాభూములు కావడంతో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించే విధంగా పరిహారాన్ని కూడా అందిస్తున్నారు. మరోవారం రోజుల్లో రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి భూమిని స్వాధీనం చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలిమినేడులో ఎరోస్పేస్ సంస్థ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో ఏడు ఎరోస్పేస్ సంస్థలు ఒకేచోట ఏర్పాటైనట్లు అవుతుంది.
100 ఎకరాల్లో కాంపోజిట్ పార్కు
ఇబ్రహీంపట్నం సమీపంలో సుమారు 100ఎకరాలలో కాంపోజిట్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తయ్యింది. ఈ పార్కులో తమ సంస్థలను ఏర్పాటు చేయడం కోసం 40కంపెనీలు ముందుకు వచ్చాయి. దీంతో వారికి ప్రభుత్వం భూములు కూడా కేటాయించింది. హైదరాబాద్కు అతిసమీపంలో ఈ పార్కును ఏర్పాటు చేయడం వలన ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో అనేక రక్షణరంగ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. రక్షణరంగంలో అతి కీలకమైన ఎన్ఎస్జీ, ఆక్టోపస్, బీడీఎల్ వంటి సంస్థలు కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటయ్యాయి.
సంతోషంగా ఉంది
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన ఎలిమినేడు గ్రామానికి భారీ ఎరోస్పేస్ సంస్థ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఎలిమినేడు గ్రామంలో ఎరోస్పేస్ పనులు మరింత వేగవంతమయ్యాయి. ఇప్పటికే అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పట్టాభూముల రైతులకు త్వరలో పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. ఎలిమినేడులో ఎరోస్పేస్ సంస్థ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని ఎలిమినేడు, కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, తులేకలాన్ గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. – ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం