శ్రీనగర్: ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉన్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను జమ్ముకశ్మీర్ పరిపాలనా యంత్రాంగం శనివారం తొలగించింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు కోసం ఏర్పాటైన కమిటీ సిఫార్సు మేరకు అనంతనాగ్కు చెందిన నలుగురు, బుద్గాంకు చెందిన ముగ్గురు, బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారాకు చెందిన ఒక్కో ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి డిస్మిస్ చేశారు. తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్ కుమారులు ఇద్దరు, విద్యాశాఖకు చెందిన నలుగురు, పోలీస్ శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్, స్కిల్ డెవలప్మెంట్, ఎస్కేఐఎంఎస్ శాఖలకు చెందిన ఒక్కో ఉద్యోగి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జమ్ము ఎయిర్బేస్పై ఇటీవల డ్రోన్లతో పేలుడు పదార్థాలు జార విడిచిన ఘటనపై దర్యాప్తులో భాగంగా ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉన్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగుల విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో వారిని ఉద్యోగం నుంచి తొలగించారు.