న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై క్రమంగా కనుమరుగవుతోందని ఆ పార్టీని వీడిన కీలక యూపీ నేత జితిన్ ప్రసాద అన్నారు. కాషాయ పార్టీలో చేరిన జితన్ ప్రసాద దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పాటుపడుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా క్షీణస్థితికి చేరుతోందని రెండు సార్లు ఎంపీగా వ్యవహరించిన జితిన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందనే ఆశ తనలో లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరాలని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
జితిన్ ప్రసాద బుధవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్టీ ముఖ్య ప్రతినిధి అనిల్ బలూనీ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. జితిన్ ప్రసాద తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధానులుగా ఉన్న సమయంలో జితేంద్ర ప్రసాద వారికి రాజకీయ సలహాదారుగా ఉన్నారు.
ఇక జితిన్ ప్రసాద మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ప్రముఖ బ్రాహ్మణ నేతగా పేరొందిన జితిన్ ప్రసాద నిష్క్రమణతో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.