రాంచీ, సెప్టెంబర్ 6: జార్ఖండ్ అసెంబ్లీలో నమాజ్ చేసుకునేందుకు ఒక గదిని కేటాయించిన తన నిర్ణయాన్ని సీఎం హేమంత్ సొరేన్ సమర్థించుకున్నారు. అసెంబ్లీలో హనుమాన్ ఆలయాన్ని నిర్మించాలని, ఇతర మతాలకు కూడా ప్రార్థనా స్థలాలను కేటాయించాలన్న డిమాండ్పై ఆయన స్పందిస్తూ ‘భగవంతుడు సర్వాంతర్యామి’ అని వ్యాఖ్యానించారు. ‘నమాజ్ గది’కి ‘ప్రార్థనా స్థలం’గా పేరు మార్చాలన్న డిమాండ్ను అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా ‘మీ హృదయంలో విశ్వాసం ఉంటే అన్నిచోట్లా దేవుడిని చూడగలరు. మీ గుండెల్లో సైతాన్ ఉంటే అందరూ శత్రువుల్లాగే కనిపిస్తారు’ అని బదులిచ్చారు. సొరేన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ‘హరే రామా’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఒకరి మెప్పు కోసం రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్య ఆలయమైన అసెంబ్లీని సొరేన్ అవమానించారని వారు విమర్శించారు.