రాంచి: జార్ఖండ్లో లాక్డౌన్ తరహా ఆంక్షలను మరింత పొడిగించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఆంక్షలు జూన్ 24న ముగియనుండటంతో ఆ ఆంక్షలను జూలై 1 వరకు పొడిగిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాజా పొడిగింపుతో జార్ఖండ్లో కొవిడ్ ఆంక్షలను ఇప్పటివరకు ఏడుసార్లు పొడిగించినట్లు అయ్యింది. తొలిసారిగా అక్కడ ఏప్రిల్ 22న కొవిడ్ ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి క్రమంగా పెంచుతూ వస్తున్నారు.
తాజాగా జార్ఖండ్ చీఫ్ సెక్రెటరీ సుఖ్దేవ్ సింగ్ పేరుతో కొవిడ్ ఆంక్షల పొడిగింపునకు సంబంధించిన ప్రకటన వెలువడింది. జూన్ 24న ఉదయం 6 గంటల నుంచి జూలై 1న ఉదయం 6 గంటల వరకు కొవిడ్ ఆంక్షలు కొనసాగుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత వారం మార్గదర్శకాలే ఈ వారానికి కూడా వర్తిస్తాయని తెలిపారు.