రాంచీ: జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అయితే అంతకు ముందే ఆమె కుడి కన్నును ఎవరో తీసివేశారు. దీంతో ఆమెపై లైంగికదాడికి పాల్పిడి, హత్య చేసిన అనంతరం చెట్టుకు వేలాడతీశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పలాము జిల్లాలోని బుద్ధబార్ గ్రామానికి చెందిన ఓ బీజేపీ నాయకుని 16 ఏండ్లు కూతురు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది. ఆయన ఐదుగురు సంతానంలో ఆమె చిన్నది. కాగా, ఆమె ఈ నెల 7న (సోమవారం) ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. మళ్లీ తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆమెకోసం గాలిస్తున్న క్రమంలో చున్నీతో చెట్టుకు వేలాడదీసి ఉన్న ఓ మైనర్ బాలికను గుర్తించిన లాలిమటి అటవీ ప్రాంత గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.
ఆమెకు ఉరివేయడానికి ముందే తీవ్రంగా హింసించారని, కుడి కన్నును శరీరం నుంచి వేరు చేశారని పోలీసులు తెలిపారు. ఆమెపై లైంగికదాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు. కాగా, ఘటనా స్థలంలో లభించిన ఫోన్ ఆధారంగా ప్రదీప్ కుమార్ సింగ్ ధనూక్ అనే యువకుడిని పోలీసులు ఆదీనంలోకి తీసుకున్నా మని వెల్లడించారు. నిందితుడిని ప్రశ్నిస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.