హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ నెల 27-30వ తేదీల మధ్య జరుగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలు కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. మళ్లీ ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తామన్న విషయాన్ని తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నది. పరీక్షకు కనీసం 15 రోజుల ముందు ఎగ్జామ్ తేదీలను ప్రకటిస్తామని చెప్పింది. ఈ పరీక్షకు తెలంగాణ నుంచి 48,868 మంది దరఖాస్తు చేసుకొన్నారు. జేఈఈ మెయిన్ను ఈ ఏడాది నుంచి నాలుగు విడుతల్లో నిర్వహిస్తున్నారు.