గత ఆర్థిక సంవత్సరం పెద్ద ఎత్తున షేర్ల విక్రయాలు
రూ.37వేల కోట్ల లాభం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభాల వరదను పారిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) వివిధ సంస్థల్లో తమకున్న వాటాల విక్రయం ద్వారా ఎల్ఐసీ రూ.37వేల కోట్ల లాభాన్ని అందుకున్నది. సంస్థ 65 ఏండ్ల చరిత్రలోనే ఇది అతిపెద్ద లాభం కావడం గమనార్హం. దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న వేళ జరిపిన అమ్మకాలు ఎల్ఐసీకి కలిసొచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2019-20) షేర్ల విక్రయాల నుంచి వచ్చిన లాభం రూ.25,625 కోట్లుగానే ఉన్నది. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో రూ.94,000 కోట్ల విలువైన షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. మార్కెట్లలో సంస్థ పెట్టుబడుల విలువ రూ.34 లక్షల కోట్లుగా ఉన్నది.
విలువైన బ్రాండ్లలో 10..
అంతర్జాతీయంగా అత్యంత విలువైన బీమా బ్రాండ్లలో ఎల్ఐసీ 10వ స్థానంలో నిలిచింది. లండన్కు చెందిన బ్రాండ్ ఫైనాన్స్ కన్సల్టెన్సీ తాజా నివేదిక ప్రకారం ఎల్ఐసీ బ్రాండ్ వాల్యూ 6.8 శాతం ఎగిసి 8.65 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా, టాప్-10 సంస్థల్లో సగం చైనాకు చెందినవే ఉన్నాయి. అమెరికా సంస్థలు రెండుండగా, ఫ్రాన్స్, జర్మనీ, భారతీయ సంస్థలు ఒక్కోటి ఉన్నా యి. ఇదిలావుంటే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అత్యంత విలువైన టాప్-100 సంస్థల బ్రాండ్ వాల్యూ 6 శాతం పడిపోయింది. నిరుడు 462.4 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది 433 బిలియన్ డాలర్లకు దిగజారింది.