న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ సంస్థల్లో బీఈ /బీటెక్ కోర్సులో చేరడానికి నిర్వహించే జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రైమరీ ఆన్సర్స్ కీ విడుదలైంది. నాలుగో విడత జేఈఈ మెయిన్ కీ, ప్రశ్నా పత్రాలు, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు https://jeemain.nta.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) ప్రకటించింది.
ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం పది గంటల వరకు వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చునని తెలిపింది. విద్యార్థులు తమ అభ్యంతరాలు తెలపడానికి ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.