పట్నా: బీహార్లో జేడీయూ నాయకుడు డాక్టర్ రాజీవ్సింగ్, ఆయన భార్య కుష్బూపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదైంది. శనివారం ఉదయం జిమ్ ట్రెయినర్ విక్రమ్ సింగ్ తన జిమ్కు వెళ్తుండగా అతనిపై హత్యాయత్నం జరిగింది. స్కూటీపై వెళ్తున్న విక్రమ్సింగ్పై ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపి, చనిపోయాడని భావించి పారిపోయారు. అయితే, అనంతరం విక్రమ్ సింగ్ గాయాలతోనే స్కూటీ నడుపుతూ ఘటనా ప్రాంతానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు అతనికి సర్జరీ నిర్వహించి శరీరంలో దిగిన బుల్లెట్లను తొలగించారు.
విక్రమ్సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. జేడీయూ నేత రాజీవ్ సింగ్, ఆయన భార్య కుష్బూసింగ్లను హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితులుగా చేర్చారు. కుష్బూ సింగ్తో తనకు ఈ ఏడాది జనవరి నుంచి పరిచయం ఉన్నదని, ఇద్దరం తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని విక్రమ్ సింగ్ చెప్పాడు. ఈ విషయం తెలియడంతో రాజీవ్సింగ్ గత ఏప్రిల్లో తనను చంపుతానని బెదిరించినట్లు తెలిపాడు. విక్రమ్ సింగ్ ఇచ్చిన సమాచారం అధారంగా పోలీసులు కాల్డాటా చెక్ చేయడంతో.. ఇద్దరి మధ్య వెయ్యికిపైగా ఫోన్ కాల్ సంభాషణలు జరిగినట్లు తేలింది.
కాగా, హత్యాయత్నం కేసులో రాజీవ్సింగ్ను ప్రధాన నిందితుడిగా చేర్చడంతో పార్టీ అతడిని వెంటనే సస్పెండ్ చేసింది. ఫిజియోథెరపిస్ట్ కూడా అయిన రాజీవ్ సింగ్ జేడీయూ మెడికల్ సెల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తాజా కేసు నేపథ్యంలో ఆ పదవి నుంచి కూడా తొలగించారు.