ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించడంతో అటు నీరజ్ చోప్రాకు, ఇటు జావెలిన్ త్రోకు ఎనలేని ప్రాచుర్యం లభించింది. ఎంతో కాలం పాటు కఠిన సాధన చేసిన నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించడంతో ఆయనపై నజరానాల వర్షం కురుస్తూనే ఉన్నది. అయితే, నీరజ్ చోప్రా కన్నా ముందు పలు పోటీల్లో జావెలిన్ త్రో (Javelin Thrower) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ క్రీడాకారుడు అనేక సమస్యలతో సతమతమవుతున్నాడు. పొరుగింటి వారు తన భూమిని లాక్కొని ఇబ్బంది పెడుతున్నా మౌనంగా భరిస్తున్నాడు. తన బోరుబావిని కూల్చేసినా మిన్నకుండిపోయాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దీనంగా చెప్తున్నాడీ ఆర్మీ జవాన్.
నీరజ్ చోప్రా ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే, ఈయన కన్నా ముందుగా ఉత్తరప్రదేశ్కు చెందిన సుబేదార్ సర్నాం సింగ్ ఇదే జావెలిన్ త్రోలో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించిపెట్టాడు. 1970 లో ఇండియన్ ఆర్మీలో చేరిన సర్నాంసింగ్.. జావెలిన్ త్రో క్రీడలో అద్భుత ప్రదర్శన సాధించి 1982 ఒలింపిక్స్కు భారత్ తరఫున పాల్గొన్నాడు. తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచారు. 1984 లో కాట్మండులో జరిగిన ఆసియా క్రీడల్లో 78.58 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి గోల్డ్ మెడల్ను చేజిక్కించుకున్నాడు. అనంతరం ఇండోనేషియా, జర్మనీ, పాకిస్తాన్లలో జరిగిన క్రీడల్లో పాల్గొని పలు పతకాలను సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో 7 గోల్డ్ మెడల్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆర్మీలో పదోన్నతి పొంది చివరకు 2001 అక్టోబర్ 1 న రిటైర్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయనకు అసలు కష్టాలు మొదలయ్యాయి.
ఆగ్రా పరిధిలోని ధోల్పూర్లో సుబేదార్ సర్నాం సింగ్కు కొంత భూమి ఉండగా.. పొరుగింటి వారు తమ పేరుపైకి మార్పిడి చేసుకున్నారు. ఈ భూమిని తిరిగి తన చేతుల్లోకి తీసుకునేందుకు తిరగని ఆఫీసంటూ లేదని ఆయన వాపోయాడు. తన బోరు బావిని కూడా నాశనం చేశారని చెప్పాడు. ఆగ్రాలోని ఉన్నతాధికారులకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. ధోల్పూర్లోనే ఒక కిరాయి ఇంట్లో భార్య, పిల్లలతో జీవిస్తున్నాడు. దేశ సరిహద్దుల్లో ఎంతో సేవలందించిన తనకు తన స్వగ్రామంలోని పొరుగింటి వారితో నిరంతర వేధింపులకు గురవుతున్నానని సర్నాంసింగ్ చెప్పాడు. ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించినా.. అప్పటి ప్రభుత్వం తనకు ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వలేదని, కనీసం ఒక గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం తన వ్యక్తిగత విషయంలోనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తన భూమిని ఇప్పించాలని ఆయన కోరుతున్నాడు.
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్కు ఐసీసీ మార్గదర్శకాలు
తాలిబాన్లకు పాక్ జనరల్స్ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ
ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
ఇంగ్లండ్లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు మోదీ తాతా..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..