న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 24 సీట్లు ఖాళీగా ఉంటాయని, వాటిని పునర్ విభజనలో కలపబోమన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూలో 53,78,538 మంది, కశ్మీర్లో 68,88,475 మంది ఉన్నారు.
కశ్మీర్లో 1981లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారని, 14 ఏళ్ల తర్వాత ఆ కమిషన్ 1995లో నివేదిక సమర్పించిందని, ప్రస్తుతం 1981 సెన్సెస్ ప్రకారమే అక్కడ నియోజవకర్గాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్లో నియోజకవర్గాల పునర్ విభజన జరగలేదన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోనున్నట్లు సీఈసీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
అన్ని రంగాల నుంచి వస్తున్న డిమాండ్లు, ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని, ఓ ముసాయిదాను తయారు చేసి ప్రజల ముందు ఉంచుతామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. జమ్మూకశ్మీర్లో కొత్త ఏడు నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.