నూతనకల్, మే 25 : 820 గృహాలు, 3104 మంది జనాభా ఉన్న తాళ్లసింగారంలో పల్లె ప్రగతి కార్యక్రమంతో పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎకరం స్థలంలో రూ.6లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాల మొక్కలు నాటడంతో ఆకట్టుకుంటున్నది. త్వరలోనే అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఆహ్లాదం పంచనుంది. రూ.12 లక్షలతో చేపట్టిన వైకుంఠధామం పనులు పూర్తి కావడంతో అంతిమ సంస్కారాలకు ఇబ్బంది తీరింది. అదేవిధంగా గ్రామ శివారులో రూ.2.51 లక్షలతో డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. వీటి ద్వారా గ్రామంలో చెత్త సమస్యకు పరిష్కారం లభించింది. ఇక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు ఎరువుగా తయారు చేసి త్వరలో రైతులకు అందించనున్నారు. రూ.3.50 లక్షలతో ట్రాక్టర్, రూ.లక్షా 80 వేలతో ట్రాలీ, రూ.1.80లక్షలతో ట్యాంకరు సమకూర్చుకుని గ్రామంలో చెత్త తరలింపునకు, మొక్కలకు నీటి సరఫరా కోసం వినియోగిస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో ఇప్పటివరకు 3వేల మొక్కలు నాటగా.. 90 శాతం బతికున్నాయి. వచ్చే హరితహారం కోసం ఊరిలో ఏర్పాటు చేసిన నర్సరీలో 11 వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామంలో రూ.22 లక్షలతో సకల హంగులతో రైతు వేదికను నిర్మించారు. సీసీ రోడ్లు వేయడం, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండడంతో వీధులు అద్దంలా మారాయి.\
ఏటా రూ.40 లక్షల నిధులు..
తాళ్లసింగారం గ్రామానికి 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా ప్రతి నెలా రూ.3 లక్షలా 10వేల చొప్పున ప్రతి సంవత్సరం రూ.40లక్షల 10వేలు సమకూరుతున్నాయి. పన్నుల ద్వారా మరో రూ.2.50 లక్షల ఆదాయం వస్తున్నది. ఈ నిధులతో గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
పల్లె ప్రగతితో మంచి గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి వల్లే మా ఊరి రూపురేఖలు మారి మంచి గుర్తింపు వచ్చింది. గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణను అమలు చేస్తున్నాం. అభివృద్ధి పనులకు గ్రామస్తులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అధికారులు సైతం ప్రోత్సాహమిస్తున్నారు.
-చూడి లింగారెడ్డి, గ్రామ సర్పంచ్
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.నిరంతరం మురుగు కాల్వల్లో బ్లీచింగ్, దోమల నివారణ మందు పిచికారీ కొనసాగిస్తున్నాం. ఊరిలో సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమాల అమలుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం.