శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ఏవియేషన్ హెలిక్యాప్టర్ను బలవంతంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో హెలిక్యాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. గాయపడిన పైలట్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించింది. జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్ ఏరియాలోగల పట్నిటాప్ సమీపంలో హెలిక్యాప్టర్ ఫోర్స్ ల్యాండ్ అయినట్లు ప్రకటించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నది.
అంతకుముందు పట్నిటాప్ వద్ద హెలిక్యాప్టర్ ఫోర్స్ ల్యాండ్ అవుతుండగా స్థానికులు చూసినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే జమ్ముకశ్మీర్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు హెలిక్యాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణమా లేదంటే ఇంకా ఏదైనా సమస్య ఉందా అనేది తెలియాల్సి ఉన్నది.