చండీగఢ్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్, రెమ్డెసివిర్, ఇతర మందులకు బాగా డిమాండ్ ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్తోపాటు ఇతర ఔషధాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు పంజాబ్లోని జలంధర్ అధికారులు వినూత్న ఆఫర్ ప్రకటించారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్, తోసిలిజుమాబ్, ఆర్టీ-పీసీఆర్ కిట్లు వంటివి బ్లాక్ మార్కెట్ చేస్తున్నా, ఎక్కువ ధరకు అమ్ముతున్నా తమకు సమాచారం అందించాలని కోరింది. వీటిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి లేదా ఆధారాలు సమర్పించి అక్రమార్కులపై కేసులు నమోదుకు సహకరిస్తే రూ.25,000 బహుమతిగా ఇస్తామని తెలిపింది. ఈ మేరకు జలంధర్ జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.