అన్నదాతలు వినియోగించుకోవాలి
కరోనా నిబంధనలు పాటించాలి
డీపీవో చంద్రమౌళి
చెన్నారావుపేట, మే 4: కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు ఊరు దాటకుండా స్వగ్రామంలోనే ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా తెలంగాణ సర్కారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని విక్రయించాలని డీపీవో చంద్రమౌళి కోరారు. మంగళవారం ఆయన అమీనాబాద్, పాపయ్యపేట, తిమ్మరాయిన్పహాడ్, కోనాపురం, ఉప్పరపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మౌలిక వసతులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలకేంద్రంలో పారిశుధ్య పనులు, చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ప్రతి గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎల్పీవో, కార్యదర్శి బాలకిషన్గౌడ్, జీపీ సిబ్బంది ఉన్నారు.
పెర్కవేడులో ఆకస్మిక సందర్శన
రాయపర్తి: పెర్కవేడులో డీపీవో ఆకస్మికంగా పర్యటించారు. సర్పంచ్ చిన్నాల తారాశ్రీ రాజబాబు, కార్యదర్శి రాజుతో కలిసి ప్రధాన రహదారులు, వార్డులు, కాలనీల్లో కలియతిరిగారు. గ్రామంలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని, కరోనా వైరస్ కట్టడికి గ్రామ పంచాయతీ చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన వివరించారు. గ్రామంలో లాక్డౌన్ అమలు చేస్తున్న విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కారోబార్ గారె ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా నియంత్రణకు కృషి చేయాలి
పర్వతగిరి: కరోనా కట్టడికి అధికారులు కృషి చేయాలని డీపీవో సూచించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని వీధులను పరిశీలించారు. ఈ పరిస్థితుల్లో పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, గుంపులుగా ఉండొద్దన్నారు. ఆయన వెంట సర్పంచ్ చింతపట్ల మాలతి, కార్యదర్శి రమేశ్ ఉన్నారు.
నిబంధనలు కచ్చితంగా పాటించాలి
నెక్కొండ: మండలకేంద్రంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని, నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలని డీపీవో చంద్రమౌళి ఆదేశించారు. నెక్కొండలోని వారంతపు సంత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఎంపీడీవో సాహితీమిత్ర, సర్పంచ్ సొంటిరెడ్డి యమున, ఉపసర్పంచ్ డీ వీరభద్రయ్యతో కలిసి సందర్శించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీలు దృష్టి పెట్టాలన్నారు. కొవిడ్ కేసులు, వ్యాక్సినేషన్పై వైద్యాధికారి రమేశ్కు సూచనలు చేశారు. డీపీవో వెంట వార్డు సభ్యుడు తోట సాంబయ్య, బిల్ కలెక్టర్ మంజుల ఉన్నారు.