హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా హార్వెస్టర్లు, ఇన్నోవర్స్, రీపర్ల వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకు 6,66,221 మంది రైతులు లబ్ది పొందారని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 951 కోట్ల 28 లక్షలు ఖర్చు చేశామన్నారు. 2021-22 సంవత్సరానికి కార్యాచరణ ప్రక్రియ రూపొందిస్తున్నామని చెప్పారు. 50 శాతం సబ్సిడీ మీద యాంత్రీకరణ పనిముట్లు ఇస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీ మారుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో యాంత్రీకరణ కోసం రూ. 1500 కోట్లు కేటాయించామన్నారు.
రాష్ర్టంలో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. వ్యవసాయం సామూహిక కార్యక్రమం అని తెలిపారు. కూలీలుగా ఉండేవారు వేరే వృత్తుల్లోకి వెళ్లడం, వేరే ఉపాధి మార్గాలను ఎంచుకోవడం ద్వారా కూలీల కొరత ఏర్పడుతుందన్నారు. ఇంకో నాలుగేళ్ల తర్వాత పొలంలో దిగే నాట్లు వేసే ఆడ పిల్లలు కనిపించారు. కాబట్టి వ్యవసాయ యాంత్రీకరణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. నాటు సమయానికి వేయకపోతే పంట దిగుబడిపై ప్రభావం ఉంటుంది. దీంతో యాంత్రీకరణ ద్వారా సాగు చేస్తే సకాలంలో నాటు పడి.. పంట దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.