కరోనా రెండో దశ రంకెలేస్తున్న ప్రస్తుత సమయంలో ప్రభుత్వం వైరస్ కట్టడికి ఓ వైపు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచుతున్నది. మాస్క్ కచ్చితం చేసి ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నది. అయినా కొందరు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా సంచరిస్తూ వైరస్ వాహకాలుగా మారుతున్నారు. సమావేశాలు, వివిధ కార్యాల్లో పాల్గొంటూ ముప్పు తెచ్చుకుంటున్నారు. నగరంలో అతిపెద్ద వ్యాపార కేంద్రం బేగంబజార్లో వ్యాపార వేళలను కుదించి కరోనా కట్టడిలో తమ పాత్ర పోషిస్తుండగా, సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాలు సాయంత్రం ఆరున్నర వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించాయి. ఇతర వ్యాపార సంస్థల సంఘాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి.
కరోనా నియంత్రణ.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే సాధ్యమవుతుందా?! ముమ్మాటికీ కాదనేది గత ఏడాది అందరికీ తెలిసిందే.. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప.. ఈ మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యంకాదనేది అక్షరాలా రుజువైంది. అయినా.. గత కొన్నిరోజులుగా అదే నిర్లక్ష్యం!!.. మాస్కులు ధరించకపోవడం.. భౌతిక దూరాన్ని విస్మరించడం.. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో జన సమూహాన్ని సాధ్యమైనంత మేరకు నిరోధించేందుకు బేగంబజార్ వ్యాపారులు నడుం బిగించడం ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు ఆర్థికంగా నష్టపోకుండా.. మరోవైపు కరోనా కట్టడిలో తమ వంతు పాత్రను పోషించేందుకుగానూ వ్యాపార సమయాన్ని కుదించుకోవడం విశేషం. వీరిని ఆదర్శంగా తీసుకొని తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణ యజమానుల అసోసియేషన్ కూడా ముందుకు వచ్చింది.. అయితే.. ప్రధానంగా వ్యాపారం సాగే ఉదయం వేళల్లో భద్రతా చర్యలు తీసుకోకుంటే మాత్రం ఈ నిర్ణయం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత సంవత్సరం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించారు. లాక్డౌన్తో పాటు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ప్రజా చైతన్యం అద్భుతంగా కనిపించింది. తద్వారానే కరోనా నియంత్రణ సాధ్యమైంది. అయితే.. కొన్నిరోజులుగా కమ్ముకుంటున్న సెకండ్ వేవ్ వెనక మితిమీరిన నిర్లక్ష్యమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మాస్కులు ధరించకపోవడం… భౌతిక దూరాన్ని పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి అనేది వేగంగా చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ… ప్రతి వ్యక్తి స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప కరోనా కట్టడి సాధ్యం కాదని వైద్య నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతగా కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటే… వైరస్ వ్యాప్తిలో గొలుసును నిరోధించవచ్చంటున్నారు.
వ్యాపారులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా కొన్ని గంటల పాటు మూసివేస్తుండటం స్వాగతించాల్సిన అంశమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాపారాన్ని కొనసాగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం కరోనా కట్టడి ఏమాత్రం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా దుకాణాల్లో శానిటైజేషన్ను అందుబాటులో ఉంచి… వచ్చిన ప్రతి వినియోగదారుడు శానిటైజ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పాటు మాస్కును కచ్చితం ధరిస్తే గానీ వైరస్ వ్యాప్తిని నిరోధించలేమని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. కాగా.. వైద్య నిపుణులు సూచిస్తున్నట్లుగా తాము దుకాణాలు తెరిచి ఉంచిన సమయంలో కూడా వ్యాపారస్తులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మాస్క్లు లేని వారికి ఉచితంగా మాస్క్లను పంపిణీ కూడా చేస్తున్నామని ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ రాఠి చెప్పారు.
నగరంలో అత్యంత రద్దీగా ఉండే వ్యాపార ప్రాంగణం బేగంబజార్ వ్యాపారులు తమ వంతుగా స్వీయ నియంత్రణకు ముందుకొచ్చారు. తమ వ్యాపారాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటలకు మాత్రమే పరిమితం చేసేందుకు నిర్ణయించి, దానిని అమలు చేస్తున్నారు. దీని ద్వారా కొంతలో కొంత రోజుకు కొన్ని గంటల పాటు జన సమూహాన్ని తగ్గించినట్లవుతుందని వ్యాపారుల అసోసియేషన్ భావిస్తుంది. దీంతో ఇతర వ్యాపార సంస్థల అసోసియేషన్లు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణాల అసోసియేషన్ ముందుకొచ్చి స్వచ్ఛందంగా కొన్ని గంటల పాటు షాపులను మూసివేయాలని నిర్ణయించింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తమ దుకాణాలను సాయంత్రం ఆరున్నర గంటల వరకే తెరచి ఉంచుతామని ప్రకటించింది.