రోమ్ : ఇటలీలోని ఓ దవాఖానలో ఉద్యోగి పదిహేనేండ్లు విధులకు హాజరు కాకుండానే రూ 4.85 కోట్లు వేతనం పొందుతూ చివరికి దొరికిపోయాడు. ఒకటిన్నర దశాబ్దం పాటు పనిచేయకుండానే నెలనెలా వేతనం పొందేందుకు అతడు తొక్కని అడ్డదారి లేదు. కలబ్రియన్ నగరంలోని పుగ్లిస్ సియాషియో దవాఖాన ఉద్యోగి 2005 నుంచి ఆఫీస్ లో అడుగుపెట్టకుండానే జీతం ఠంచనుగా జేబులో వేసుకున్నట్టు వెల్లడవడంతో అధికారులు విస్తుపోయారు. విధులకు గైర్హాజరు కావడాన్ని పసిగట్టకుండా 67 ఏండ్ల ఉద్యోగి పలు మార్గాలను ఎంచుకున్నాడని కటంజరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
విధులకు రాకుండా వేతనం పొందుతుండటంతో తనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టకుండా నిందితుడు దవాఖాన డైరెక్టర్ ను బెదిరించినట్టు తెలిపింది. సదరు డైరెక్టర్ రిటైరైన తర్వాత ఆ పదవిలోకి వచ్చిన మరో డైరెక్టర్, హెచ్ఆర్ అధికారులు ఉద్యోగి గైర్హాజరును గుర్తించలేదు. ఇక ఉద్యోగి నిర్వాకం ఇటీవల బయటపడటంతో అతడిని విధుల నుంచి తొలగించారు. కార్యాలయాన్ని తప్పుదారి పట్టించడంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు మేనేజర్లను పోలీసులు విచారిస్తున్నారు. విధులకు హాజరుకాకకుండా ఏండ్ల తరబడి జీతం పొందిన ఉద్యోగిని కింగ్ ఆఫ్ ఆబ్సెంటీస్ గా ఇటాలియన్ మీడియా అభివర్ణించింది.