హైదరాబాద్, ఏప్రిల్ 04 (నమస్తే తెలంగాణ): కల్వకుర్తి ఎత్తపోతల పథకం (కేఎల్ఐ) కాలువలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వట్టెం ప్రాజెక్టు ద్వారా 1,850 క్యూసెక్కుల నీళ్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. సీఎం ఆదేశాలమేరకు ఆదివారం కేఎల్ఐ-పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణ కలిసి సమీక్షించారు. కల్వకుర్తి ఆయకట్టు పెరిగినందున ఇప్పుడున్న కాలువల సామర్థ్యం సరిపోదని మంత్రి తెలిపారు. అయిదు పంపులు నడిపే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు తక్కువ సామర్థ్యంతో కాలువలు నిర్మించడం వల్ల ఆయకట్టు మొత్తానికి నీరివ్వటం అసాధ్యంగా మారిందన్నారు.
సామర్థ్యం 2.5 లక్షలు.. ఆయకట్టు 5 లక్షలు
కేఎల్ఐని 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే ప్రతిపాదించి నిర్మించారని, నేడు ఆయకట్టు విస్తీర్ణం 5లక్షల ఎకరాలకు చేరిందని మంత్రి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చివరిదశకు చేరినందున కేఎల్ఐ అదనపు ఆయకట్టుకు పాలమూరు -రంగారెడ్డిలో భాగమైన వట్టెం రిజర్వాయర్ నుంచి నీళ్లందించాలన్న ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ఆమోదించారని చెప్పారు. కేఎల్ఐ ప్రధాన కాలువ సమర్థ్యం లక్షా 80 వేల ఎకరాలేనని, నేడు దీని పరిధిలో ఆయకట్టు 3 లక్షల ఎకరాలు దాటిందని వెల్లడించారు. అందుకే వట్టెం రిజర్వాయర్ నుంచి నీరందించనున్నట్టు తెలిపారు. గణప సముద్రం చెరువు కట్టను విస్తరించాలని, డీ-8, పసుపుల బ్రాంచ్ కెనాల్, డీ-5లను విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఖిల్లా ఘణపురం మండలం షాపూర్ వద్ద వయడక్డ్ వెంటనే పూర్తిచేసి వచ్చే వానాకాలంలో అడ్డాకుల వరకు సాగునీరు అందించాలని, బుద్దారం కాలువపై పెండింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కేఎల్ఐ పంపులను ఆపిన వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని చెరువులను కాలువల పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఇవీ కూడా చదవండి…
కాళేశ్వరం బ్యాక్వాటర్లో బోటింగ్