పని గంటలు లేవు. పని ఉంది. ఉండేది ఇంట్లోనే. కుటుంబంతో గడపడానికి సమయం లేదు. ఆఫీసుకు వెళ్తే వారాంతాల్లో సెలవులతో మైండ్ రీఫ్రెష్ అయ్యేది. వర్క్ ఫ్రమ్ హోంలో సెలవుల్లేవు సరికదా రోజంతా పనే. అమాసకో.. పున్నానికో సెలవు దొరికినా బాస్ ఎప్పుడు ఫోన్ చేస్తారో.. ఏం పని చెప్తారోనన్న భయం. ఉద్యోగ జీవితానికి, రోజువారీ జీవితానికి తేడా మాయం. వెరసి పెరుగుతున్న ఒత్తిడి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు అయిపోతుందో.. మళ్లీ ఆఫీసుకెళ్లి పనిచేసుకొని.. ఇంటికొచ్చి హాయిగా ఉండే రోజులు ఎప్పుడొస్తాయో.. సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి మానసిక స్థితి ఇది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: సాఫ్ట్వేర్ ఉద్యోగులు కంపెనీలకు వెళ్లి ఏడాదిన్నర అయింది. కరోనా కారణంగా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. మహమ్మారి ఉద్ధృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని పొడిగిస్తూ వచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులంతా తమ సొంత గ్రామాలకు వెళ్లి ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే, వర్క్ ఫ్రమ్ హోం అంటే తొలుత సంతోషపడ్డ ఉద్యోగులు ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ఒత్తిడితో పనిచేయడం కష్టంగా మారిందని, ఆఫీసులు తెరిస్తేనే బాగుంటుందని కోరుతున్నారు. కరోనా పట్ల కొంత మందిలో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ మెజారిటీ ఉద్యోగులు కంపెనీలకు రావడానికే ఇష్టపడుతున్నట్టు తెలుస్తున్నది.
సేవల రంగంపై ప్రభావం
సెప్టెంబర్ చివరి నుంచి ఐటీ కంపెనీలను పూర్తి స్థాయిలో తెరువాలని తెలంగాణ ప్రభుత్వం జూలైలో ప్రకటించింది. అదే పనిగా వర్క్ ఫ్రమ్హోమ్ కొనసాగించడం వల్ల ఆ ప్రభావం ఉద్యోగులపైనే కాకుండా సేవల రంగంపై కూడా పడుతుందని తెలంగాణ ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. అప్పుడు ఉద్యోగాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ వేగం పెరగడంతో ఉద్యోగుల ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు కొంత మంది ఉద్యోగుల అభిప్రాయాల ద్వారా వ్యక్తం అవుతున్నది.
కంపెనీలు కూడా
ఐటీ కంపెనీలు కూడా సాధ్యమైతే వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మెల్లమెల్లగా తగ్గించాలని భావిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ కార్యాలయాల్లోనే వ్యాక్సినేషన్ ఏర్పాటు చేస్తామని ఉద్యోగులు రావాలని కోరుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకొని సిద్ధంగా ఉండాలని, పిలిచినప్పుడు ఆఫీసుకు రావాలని సందేశాలను పంపించినట్టు సమాచారం.
విప్రోలో వారంలో రెండు రోజులు
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ విప్రో.. తమ ఉద్యోగులు సోమవారం నుంచి కార్యాలయాలకు రావాలని కోరింది. ఉద్యోగులు వారంలో రెండు రోజుల పాటు ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఆదివారం ట్వీట్ చేశారు. హైబ్రిడ్ విధానం (కొందరు ఇంటి నుంచి, కొందరు ఆఫీసు నుంచి)లో కంపెనీ కార్యకలాపాలు నడుస్తాయన్నారు. ‘18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత విప్రో ఉద్యోగులు నేటి నుంచి ఆఫీసులకు రానున్నారు’ అని రిషద్ తెలిపారు.