న్యూఢిల్లీ : అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ అకౌంట్ను ట్విట్టర్ శుక్రవారం గంటపాటు నిలిపివేయటం కలకలం రేపింది. ఆ తర్వాత పునరుద్ధరించింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే ట్విట్టర్తోపాటు, ‘కూ’ లో వెల్లడించారు. అమెరికా ‘డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్’ (డీఎంసీఏ)ను ఉల్లంఘించిన కారణంగా తన అకౌంట్ను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొన్నదని తెలిపారు. ట్విట్టర్ చర్య భారతీయ ఐటీ చట్టాలకు పూర్తి వ్యతిరేకమని, తన అకౌంట్ను నిలిపివేస్తున్నట్లు కనీసం తనకు ముందస్తు నోటీసూ ఇవ్వలేదన్నారు.
దేశ చట్టాలకు కట్టుబడాల్సిందే
కొత్త ఐటీ చట్టాలపై కేంద్రానికి, ట్విట్టర్కు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ అంశంపైనే వివిధ టీవీఛానళ్లకు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలను ట్విట్టర్లో షేర్ చేశానని, దానిని సహించని ట్విట్టర్ ఇప్పుడు తన అకౌంట్ను బ్లాక్ చేసిందని రవిశంకర్ప్రసాద్ పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అని గొంతుచించుకునే ట్విట్టర్ నిజానికి దానిని పాటించదని ప్రస్తుత దృష్టాంతం తెలియజేస్తున్నదన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించే ఏ సంస్థ అయినా దేశ ఐటీ చట్టాలను పాటించాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఐటీశాఖ వర్గాలు ఈ వివాదంపై స్పందిస్తూ భారతీయుల అకౌంట్లకు అమెరికా చట్టాలను వర్తింపచేయటమేమిటని ట్విట్టర్ను ప్రశ్నించారు.
తీరు మారకపోతే ఖాతానే సస్పెండ్ చేస్తాం
మంత్రి ఖాతాను కొంతసేపు నిలిపివేసిన ట్విట్టర్ ఆ సమయంలో ఆ అకౌంట్కు నోటీసు పంపించింది. డీఎంసీఏ చట్టంలోని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందువల్లే ఈ చర్య తీసుకున్నామని, మరోసారి ఇదే పని చేస్తే ఖాతాను మొత్తానికే సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. అయితే, ట్విట్టర్ అధికారప్రతినిధి ప్రకటన విడుదల చేస్తూ.. డీఎంసీఏ నోటీసు కారణంగా గౌరవ మంత్రి అకౌంట్ను తాత్కాలికంగా నిలిపివేసిన మాట నిజమే. సంబంధిత ట్వీట్ను నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.
నాకూ అదే పరిస్థితి ఎదురైంది:థరూర్
రవిశంకర్ అకౌంట్ను నిలిపివేయటంపై ట్విట్టర్ను వివరణ అడుగుతామని ఐటీ పార్లమెంటరీ సంఘం చైర్మన్ శశిథరూర్ తెలిపారు. గతంలో తన అకౌంట్నూ ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. కాపీరైట్ ఉన్న ఒక పాటను తాను షేర్ చేయటంతో ఆ పని చేశామని ట్విట్టర్ చెప్పిందని, వీడియో తొలగిస్తే సరిపోయేదానికి ఖాతాను నిలిపివేయటం ఎందుకన్నారు.
సోనీ ఫిర్యాదుతోనే..
‘సోనీ మ్యూజిక్ ఎంటైర్టెన్మెంట్’ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు వల్లే రవిశంకర్ ట్విట్టర్ ఖాతాను గంటపాటు నిలిపివేసినట్టు సమాచారం. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఆల్బమ్ ‘మా తుఝే సలామ్’ గీతాన్ని (దీని హక్కులు సోనీ సంస్థకు దక్కాయి) రవిశంకర్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో సోనీ తరఫున ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఫోనోగ్రాఫిక్ ఇండస్ట్రీ (ఐఎఫ్పీఐ) ట్విట్టర్కు ఫిర్యాదుచేసింది.