న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డు స్థాయిలో పతనమైంది. నెల రోజుల వ్యవధిలో సుమారు 45 శాతం తగ్గడం గమనార్హం. ఏప్రిల్ 5న అత్యధికంగా 43 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. మే 6కు వచ్చేసరికి అది 23.7 లక్షలకు పడిపోయింది. ఇప్పుడున్న వేగమే కొనసాగితే 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ఏకంగా 32 నెలలు పడుతుంది. ఇప్పుడున్న కరోనా సంక్షోభ సమయంలో ఇది చాలాచాలా ఆందోళన కలిగించే విషయం.
ఓవైపు దేశంలో వరుసగా మూడోరోజు 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తగినన్ని వ్యాక్సిన్లు లేక వ్యాక్సినేషన్ సెంటర్లు మూతపడుతున్నాయి. తెలంగాణలో అయితే 18 ఏళ్లు నిండిన వాళ్లకు ఇప్పట్లో వ్యాక్సిన్లు ఉండవని ప్రభుత్వం చెప్పేసింది. ఇక మే 15 వరకు కేవలం రెండో డోసు వాళ్లకే ఇస్తామనీ ప్రకటించింది. ఇప్పుడు దేశమంతా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సిన సమయంలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.
ఇండియాలో వారం వారం వ్యాక్సినేషన్ సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ 3 నుంచి 9 మధ్య వారంలో ఇండియా 2.48 కోట్ల మంది వ్యాక్సిన్లు వేయగా.. అది తర్వాతి వారంలో 2.07 కోట్లకు, మూడో వారంలో 1.7 కోట్లకు, చివరి వారంలో 1.48 కోట్లకు తగ్గింది.
మే నెల తొలి ఆరు రోజుల్లో అయితే కేవలం 99.83 లక్షల డోసులు మాత్రమే ఇచ్చారు. ఏప్రిల్లో సగటున ప్రతి రోజూ 30 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. అది ఈ నెలలో 16 లక్షలకు పడిపోయింది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లను వదిలేస్తే.. రానున్న రోజుల్లో ఇవ్వాల్సిన వాళ్ల సంఖ్య 81 కోట్లుగా ఉంది. ఓవైపు వ్యాక్సిన్లు తీసుకోవాలనుకునే వాళ్ల సంఖ్య పెరిగిపోతుండగా.. మరోవైపు వ్యాక్సిన్ల కొరత ఎక్కువవుతోంది.
ఇప్పటి వరకూ కేంద్రం రాష్ట్రాలకు 17.35 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగేలా లేదు. ఈ కొరత జులై వరకూ ఉంటుందని సీరం సీఈవో అదర్ పూనావాలా కూడా చెప్పారు. ప్రస్తుతం ఉత్పత్తి నెలకు 7 నుంచి 8 కోట్లు కాగా.. పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ కొనసాగాలంటే అవసరమైనవి 20 నుంచి 25 కోట్లు. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కేవలం 12 రాష్ట్రాలు, యూటీలు మాత్రమే 18 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సిన్లు వేసే ప్రక్రియను ప్రారంభించాయి. అందులో ఇప్పటి వరకూ కేవలం 11.64 లక్షల మందే వ్యాక్సిన్లు తీసుకున్నారు.