న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జనగణన నుంచి ఆయా కులాల సమాచారాన్ని మినహాయించాలన్నది పూర్తి అవగాహనతో తీసుకున్న విధాన నిర్ణయమేనని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇటీవల బీహార్ సీఎం నితీశ్కుమార్ సారథ్యంలో ఆ రాష్ట్రం నుంచి 10 పార్టీల ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్రమోదీని కలిసి కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తన వైఖరిని తెలియజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2011లో నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ)లో కులాల సమాచారం తప్పులతో నిండిందని కేంద్రం తెలిపింది. కులాలవారీగా జనగణన తీవ్రమైన సంక్లిష్టతతో కూడినదని, స్వాతంత్య్రానికి ముందు నిర్వహించినప్పుడు కూడా కచ్చితత్వం, సమగ్రత లోపించిందని పేర్కొంది. ఎస్ఈసీసీ 2011 ముడి డాటాను తమకు ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దీనిపైనే కేంద్రం ప్రస్తుత అఫిడవిట్ను దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాల కులాల సమాచారాన్ని సేకరించడానికి 2011 ఎస్ఈసీసీలో కసరత్తు జరిగిందని, అది కేవలం ఓబీసీ సర్వే కాదని అఫిడవిట్లో తెలిపింది.