అస్సాం : అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా సీఎం హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు. సంస్థకు చెందిన ఇద్దరు అగ్ర లీడర్లు సైతం ఎన్కౌంటర్లో గాయపడినట్లు ఆయన తెలిపారు. ఎన్కౌంటర్పై ఆదివారం మధ్యాహ్నం మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు ఘటనాస్థలంలోనే చనిపోయారని, ఘటనాస్థలంలో 3 ఏకే- 47లు, భారీగా పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.
అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాల సరిహద్దులో ఆ జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశ్ సోనోవాల్ ఆధ్వర్యంలో తిరుబాటుదారుల ఏరివేతకు భద్రతాదళాలు శనివారం రాత్రి ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో ఏడుగురు తిరుగుబాటుదారులను ఎన్కౌంటర్లో హతమార్చారు. అస్సాం పోలీసులు, అస్సాం రైఫిల్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. అస్సాంలోని డిమా హసావో, కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలతోపాటు నాగాలాండ్ సరిహద్దు జిల్లాల్లో డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.