చెన్నై : ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బుధవారం బినామీ లావాదేవీల నిషేధిత చట్టం కింద అటాచ్ చేసింది. చెన్నై శివార్లలోని పయ్యనుర్ గ్రామంలోని ఆస్తులను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. కాగా గత ఏడాది శశికళ, ఆమె సన్నిహితులకు చెందిన చెన్నైలోని దాదాపు 65 ప్రాపర్టీలను ఐటీ శాఖ అటాచ్ చేసింది.
ఇక అవినీతి కేసులో నాలుగేండ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి తమిళనాడుకు చేరుకున్న సంగతి తెలిసిందే. రూ 66 కోట్ల అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ 2017 నుంచి జైలులో ఉన్నారు. జయలలితతో కుమ్మక్కై శశికళ నేరపూరిత కుట్రకు పాల్పడి ఆదాయం కంటే అధికంగా ఆస్తులను ఆర్జించారనే అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. 2019లో బినామీ చట్టం కింద శశికళకు చెందిన రూ 1600 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ అధికారులు అటాచ్ చేశారు.