చౌటుప్పల్ రూరల్, జూలై 13 : స్వరాష్ట్రంలో రవీంద్రభారతి, త్యాగరాయగానసభ లాంటి వేదికలపైనే కాదు ముంబాయి, చైనా దేశంలో సైతం ఘంటసాల పాటలు పాడి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అచ్చం ఘంటసాలగా పాటలుపాడి శ్రోతలను మైమరిపిస్తున్నాడు. ఘంటసాలకే ఏకలవ్వ శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బుడ్డ శ్రీనివాస్. అతడి పాటలతో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. వీరి నాన్న యాదయ్య, పెద్దనాన్న రాములు యాక్షగాన కళాకారులు. దీంతో చిన్నతనంలో ఇంట్లో ఉండే తబలా వాయిస్తూ రేడియోలో వచ్చే ఘంటసాల పాటలు వింటూ సాధన చేసేవాడు. సుమారు 35 ఏండ్లుగా పాటలు పాడుతూ అభినవ ఘంటసాలగా పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడిది నిరుపేద కుటుంబం కావడంతో మండల పరిధిలోని నేలపట్ల హాస్టల్లో చేర్పించారు. ఈక్రమంలో ఐదోతరగతి చదివేటప్పుడు పాఠశాల వేదికపై పాట పాడి బహుమతి సాధించాడు. అప్పటి నుంచి ప్రారంభమైన అతడి పాటల ప్రస్తావన జిల్లాస్థాయి నుంచి విదేశాల వరకు వెళ్లింది. ఇలా వందలాది ఘంటసాల పాటలు పాడి పలువురి నుంచి అభినందనలు అందుకున్నాడు.
దేశ, విదేశాల్లో ప్రశంసలు
2019 స్వరమాధురి సంస్థ వారు ముంబై నగరంలోనే కాకుండా చైనాదేశంలోని షాంఘైనగరంలో తెలుగు అసోసియేషన్ వేదికపై పాటలు పాడి బుడ్డ శ్రీనివాస్ ప్రశంసలు అందుకున్నాడు. 2018లో ప్రాజ్ఞకా ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు ఘంటసాల అవార్డు ప్రదానం చేశారు. దీనికితోడు ఘంటసాల గానకౌముది బిరుదుతో కూడా సత్కారించారు. అప్పటి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, సినీగేయ రచయిత చంద్రబోస్ సత్కరించారు. అంతేకాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో సైతం పాటలు పాడాడు. ముంబై తెలుగు కళాసమితి సంక్రాంతి సంబురాల్లో కూడా పాటలు ఆలపించాడు. అదే రాష్ట్రంలోని పలు కార్యక్రమాల్లో అతడు గానాన్ని ఆలపించాడు. హైదరాబాద్లోని కిన్నెర ఆర్ట్స్ వారు నిర్వహించిన ఆరుద్ర 81జయంతి సభలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన ఘంటసాల స్వరరాగ మహాయాగంలో పాటలు పాడి ప్రముఖ కవి సినారె నుంచి జ్ఞాపిక, సన్మానం అందుకున్నాడు. ప్రముఖ సినీ నటి షావుకారు జానకి నుంచి సన్మానం పొందాడు. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన సినీనటుడు కాంతారావు స్వరనీరాజనంలో నేపథ్యగాయని జమునారాణి ప్రశంసలు పొందారు. శతాయుష్మాన్భవ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వర్రావు చేతులమీదుగా సన్మానం పొందారు. అప్పటి సీఎం రోశయ్య చేతులమీదుగా కూడా అవార్డు అందుకున్నాడు. డాక్టర్ సినారె చేతులమీదుగా జ్ఞాపికలు అందుకున్నాడు.
సహకారం అందిస్తే రాణిస్తా..
ప్రభుత్వ సహకారం అందిస్తే మరింత రాణి స్తా. ప్రస్తుతం జీవనోపాధి కోసం స్థానికంగా ఓ పరిశ్రమలో దినసరి కూలిగా పని చేస్తున్నా. ఎక్కడన్నా కార్యక్రమాలకు వెళ్లాలంటే పని మానేయాల్సి వస్తోంది. దీంతో ఇబ్బంది పడుతున్నా. అయినా ఎవరైనా అవకాశం ఇస్తే ఎక్కడికైనా వెళ్లి పాటలు పాడేందుకు సిద్ధంగా ఉన్నా. దాతలు ముందుకువచ్చి ఆర్థిక సాయం అందిస్తే ఘంటసాల పాటలను మరింత ముందుకు తీసుకువెళ్తా…
-బుడ్డ శ్రీనివాస్, పంతంగి,చౌటుప్పల్ మండలం