న్యూఢిల్లీ, మే 15: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా అయిదో రోజు శనివారం కూడా కొనసాగాయి. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా.. ప్రతిగా ఇజ్రాయెల్పైకి హమాస్ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగించారు. ఇజ్రాయెల్ విమానాలు గాజాలో ఒక మసీదును ధ్వంసం చేశాయని పాలస్తీనా మత వ్యవహారాల శాఖ తెలిపింది. గాజాపై దాడుల్లో ఇప్పటి వరకు 132 మంది మరణించారని, వారిలో 32 మంది పిల్లలు, 21 మంది మహిళలు ఉన్నారని పాలస్తీనా అధికార వర్గాలు తెలిపాయి. మరో 950 మంది గాయపడ్డారని పేర్కొన్నాయి. వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ బలగాలతో జరిగిన ఘర్షణలో మరో 11 మంది పాలస్తీనా నిరసనకారులు మరణించారు. గాజా సిటీలోని అసోసియేటెడ్ ప్రెస్, అల్ జజీరాతో పాటు పలు వార్తా సంస్థల కార్యాలయాలు ఉన్న బహుళ అంతస్తుల భవంతిని ఇజ్రాయెల్ కూల్చివేసింది. భవనంలోని వారిని ఖాళీ చేయాలని ఆదేశించిన ఇజ్రాయెల్ మిలిటరీ.. గంట తర్వాత ఆ భవనాన్ని క్షిపణులతో నేలమట్టం చేసింది.
గాజా నుంచి ఇప్పటి వరకు 2 వేల రాకెట్లను ప్రయోగించారని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతున్నది. వాటిలో సగం రాకెట్లను తమ రక్షణ వ్యవస్థతో గాలిలోనే పేల్చేశామని, మరో 350 రాకెట్లు గాజా పట్టీలో పడ్డాయని పేర్కొన్నది. మరోవైపు, మధ్య, దక్షిణ ఇజ్రాయెల్ వ్యాప్తంగా చిన్న పట్టణాల నుంచి టెల్ అవీవ్ వరకు హెచ్చరిక సైర్లన్లతో ప్రజల చెవులు చిల్లులు పడుతున్నాయి. యూదులు, అరబ్లు కలిసి నివసిస్తున్న చిన్న నగరాల్లో కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదముందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు పేర్కొన్నారు. మరోవైపు, ఇరు పక్షాలతో దాడులను విరమింపజేసేందుకు ఈజిప్టు సారథ్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వివాదానికి రాజకీయ పరిష్కారం కనుగొనేలా భద్రతా మండలి ఐక్యంగా కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సూచించారు. ఇస్లామిక్ సహకార సంస్థలోని 57 ముస్లిం దేశాల విదేశాంగ మంత్రులతో సౌదీ అరేబియా ఒక సమావేశం నిర్వహించనున్నది. వర్చువల్గా జరిగే ఈ భేటీలో ఇజ్రాయెల్ హింసాత్మక చర్యలకు పాల్పడటంపై చర్చించనున్నారు.