వివిధ దేశాల్లో కరోనా సరళి
దేశం ఫస్ట్వేవ్ సెకండ్వేవ్ థర్డ్వేవ్ (అంచనా)
అమెరికా జూలై, 2020 జనవరి, 2021 –
బ్రిటన్ ఏప్రిల్, 2020 జనవరి, 2021 ఆగస్టు, 2021
భారత్ సెప్టెంబర్, 2020 మే, 2021 ఫిబ్రవరి-ఏప్రిల్, 2022
కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సంతో భారత్ చిగురుటాకులా వణికిపోయింది. ఒక దశలో రోజూవారీ కేసులు 4 లక్షల మార్కును దాటడం కలవరపెట్టింది. గతకొద్ది రోజులుగా రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, కరోనా థర్డ్వేవ్ (మూడోదశ ఉద్ధృతి) రాబోతున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మూడోదశ విజృంభణపై పలువురు నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. థర్డ్వేవ్ కచ్చితంగా వస్తుందని కొందరు చెబుతుండగా, వచ్చే అవకాశంలేదని మరికొందరు పేర్కొంటున్నారు.
-నేషనల్ డెస్క్
వైరస్ కొత్త ఉత్పరివర్తనంతో ప్రమాదమే!
దేశంలో మూడోవేవ్ ముప్పు అనివార్యమని కేంద్రప్రభుత్వానికి ప్రధాన శాస్త్ర సలహాదారుడిగా వ్యవహరిస్తున్న కే విజయ్ రాఘవన్ తెలిపారు. కరోనా మూల వైరస్ ఉత్పరివర్తనాలు చెందిన తర్వాత ఏర్పడిన బీ.1.617.2 వేరియంట్ (డెల్టా) కారణంగా దేశంలో సెకండ్వేవ్ ఉద్ధృతి మొదలైందన్నారు. అలాగే, వైరస్ మరోసారి ఉత్పరివర్తనం చెందితే థర్డ్వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించారు. మరోవైపు, వచ్చే ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో దేశంలో మూడో వేవ్ రావొచ్చని భారత శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్టీ) కరోనాపై ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలో ఒకరు, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. అయితే, మూడోవేవ్ రావడానికి గల కారణాలను మరింత లోతుగా విశ్లేషించాలన్నారు. ఇంకోవైపు, ఫస్ట్వేవ్ లాగానే సెకండ్ వేవ్ కూడా అంతే తీవ్రంగా ఉండొచ్చని ఎస్బీఐ నిపుణుల నివేదిక అంచనా వేసింది. సుమారు 98 రోజుల పాటు మూడో వేవ్ కొనసాగవచ్చని అభిప్రాయపడింది. కాగా సెకండ్వేవ్కు సంబంధించి ఎస్బీఐ గత అంచనాలు నిజమవ్వడం గమనార్హం.
వేవ్ల మధ్య వ్యవధి ఎందుకు?
అమెరికా, బ్రిటన్, భారత్ వంటి దేశాల్లో కరోనా ఉద్ధృతి, గణాంకాలను విశ్లేషిస్తే.. ఫస్ట్వేవ్, సెకండ్ వేవ్ మధ్యనున్న సరాసరి వ్యవధి 6 నుంచి 8 నెలలుగా అర్థమవుతున్నది. కేసుల ఉద్ధృతిలో తగ్గుదల కనిపించగానే ప్రజలు నిబంధనలను గాలికొదిలేయడం, ప్రభుత్వాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో సూపర్ స్ప్రెడర్ల ద్వారా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగడం, కొత్త ఉత్పరివర్తనాలకు వైరస్ గురికావడం తదితర కారణాల వల్ల వైరస్ వేవ్ల మధ్య సగటున ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధి కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది.
ముప్పు వస్తుందని చెప్పలేం!
దేశంలో మూడోవేవ్ ఉద్ధృతి వస్తుందని కచ్చితంగా చెప్పలేమని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జయప్రకాశ్ ములియాల్ తెలిపారు. ఫస్ట్వేవ్, సెకండ్వేవ్లో ఎంతోమంది వైరస్బారిన పడి రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో ఐసీఎంఆర్ జాతీయస్థాయిలో జరిపిన సెరోసర్వేలో వైరస్కు వ్యతిరేకంగా దేశంలోని 28 కోట్ల మందిలో యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) అభివృద్ధి చెందినట్టు వెల్లడైందని గుర్తుచేశారు. మేలో కరోనా సెకండ్వేవ్ ఉద్ధృతి కొనసాగిన నేపథ్యంలో.. వైరస్కు వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలు వృద్ధిచెందిన వారి సంఖ్య మరింత పెరిగిందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలవ్వడం దీనికి సాయపడిందని పేర్కొన్నారు. ఈ కారణాలను పరిశీలిస్తే థర్డ్వేవ్ వచ్చే అవకాశం దాదాపుగా లేదన్నారు. అయితే, కరోనా వైరస్లో పెద్దమొత్తంలో మార్పులు జరిగితే తప్ప మూడోవేవ్ ప్రసక్తే ఉండదని పేర్కొన్నారు. మరోవైపు, ఫస్ట్వేవ్లో మహమ్మారిబారిన పడి కోలుకున్న వారిలో కేవలం 5 శాతం మంది మీదే సెకండ్వేవ్లో కొత్త మ్యుటెంట్ ప్రభావం చూపించిందని ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ.. ముందుజాగ్రత్తగా టీకాలు వేసుకుంటే కరోనా కారణంగా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.