న్యూఢిల్లీ: రాజ్యాంగం కల్పించిన ‘నిరసన తెలిపే హక్కుకు’, ఉగ్రవాద చర్యకు మధ్య తేడా ఉన్నదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన కేసులో గతేడాది అరస్టైన ముగ్గురు విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగన కలితా (జేఎన్యూ), అసిఫ్ ఇక్బాల్ తన్హా (జామియా మిలియా ఇస్లామియా) లకు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. తీర్పు సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ‘అసమ్మతిని అణచివేయాలనే ఆరాటంలో కేంద్రానికి.. రాజ్యాంగం హామీ ఇచ్చిన నిరసన తెలిపే హక్కుకూ, ఉగ్రవాద చర్యకు మధ్య ఉన్న తేడా మసకబారినట్టు అనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం. సాధారణంగా ఐపీసీ కిందకు వచ్చే నేరాలకు ఉగ్రవాద చర్య పేరుతో యూఏపీఏ చట్టాన్ని వర్తింపజేయరాదు. అతిశయోక్తి ప్రసంగాలు మినహా నిందితులపై మోపిన అభియోగాలు ఏవీ యూఏపీఏ కిందకు రావు’ అని కోర్టు అభిప్రాయపడింది. మన దేశ పునాదులు బలంగా ఉన్నాయని, కేవలం కాలేజీ విద్యార్థుల నిరసనలతో అవేమీ చెదరవని వ్యాఖ్యానించింది.
ఆ చట్టంలోనే స్పష్టత లేదు
యూఏపీఏ చట్టంలోనే ‘ఉగ్రవాద చర్య’ను అస్పష్టంగా నిర్వచించారని కోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ కింద వచ్చే నేరాలకూ ఈ చట్టాన్ని సాధారణరీతిలో అమలుచేయడం తగదని హితవు పలికింది.