న్యూఢిల్లీ : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడి పలువురి ప్రాణాలు గాల్లో కలుస్తున్న నేపథ్యంలో వైరస్ తీరుతెన్నులు మహమ్మారి బలహీనపడిందనే సంకేతాలు పంపడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తాజా పాజిటివ్ కేసుల్లో భారీ తగ్గుదలతో మహమ్మారి తోకముడుస్తోందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తొలిసారిగా తాజా కేసులు మూడు లక్షలకు దిగువన 2,81,860 కేసులకు పడిపోయాయి.
ఆక్సిజన్ తో పాటు మందుల కొరత దేశాన్ని ఇంకా వెంటాడుతున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా కేసులు భారీగా తగ్గడం అధికార యంత్రాంగంతో పాటు వైద్య నిపుణుల్లో ఉపశమనం కలిగిస్తోంది. మరోవైపు దేశీ వ్యాక్సిన్లు కొవాక్సిన్, కొవీషీల్డ్ తో పాటు తాజాగా రెడ్డీ లేబొరేటరీస్ భాగస్వామ్యంతో రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోనుంది.
ఫైజర్ వ్యాక్సిన్ దిగుమతికీ సన్నాహాలు ఊపందుకోవడంతో సామాన్య ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్లు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. ఇక కొవిడ్ రోగుల్లో ఆక్సిజన్ సమస్యను, రికవరీ సమయాన్ని తగ్గించేలా డీఆర్డీఏ రూపొందించిన 2-డీజీ డ్రగ్ లాంఛ్ కావడం కొవిడ్-19 చికిత్సలో గేమ్ ఛేంజర్ గా మారుతుందని భావిస్తున్నారు.