హైదరాబాద్ : సబ్బండ వర్గాల సంక్షేమ, అభివృద్ధి సమాహారంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బడ్జెట్పై మంత్రి స్పందిస్తూ.. అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే లక్ష్యంగా 2020–21 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్కు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, సకల జనుల సంక్షేమం, అభివృద్ధిని వీడకుండా బడ్జెట్ని రూపొందించారని కొనియాడారు. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు తెలిపారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథకు నిధులు కేటాయించడంపై సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ. 27వేల 271 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ. 11వేల 728 కోట్లు, జిల్లా పరిషత్లకు రూ. 252 కోట్లు, మండల పరిషత్లకు రూ. 248 కోట్లు కేటాయించారన్నారు. ఇక వడ్డీలేని రుణాల కింద రూ. 3వేల కోట్లు కేటాయించారని, దీని ద్వారా రాష్ట్రంలోని 4 లక్షల 29వేల 262 మహిళా సంఘాలు, అందులోని 46లక్షల 65వేల 443 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.
వరంగల్ కార్పొరేషన్కి రూ. 250 కోట్లు కేటాయించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. గతంలో కంటే అధికంగా నిధులు కేటాయించడం వల్ల హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. వరదలకు దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ. 11 వందల కోట్లు ప్రతిపాదించడం వల్ల కూడా వరంగల్కి ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.