న్యూఢిల్లీ: భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ, ప్రైవేటుగా నిర్వహిస్తున్న రెండు తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించారు. అహ్మదాబాద్-ముంబై, లక్నో-న్యూఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి నడుస్తాయని ఐఆర్సీటీసీ తెలిపింది. కాగా, ప్రైవేట్గా నిర్వహించే ఈ రెండు తేజస్ రైళ్లను కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నాలుగు నెలల కిందట రద్దు చేశారు. 2019 అక్టోబర్లో ప్రారంభించిన న్యూఢిల్లీ-లక్నో తేజస్ ఎక్స్ప్రెస్ రైలు ఆరు గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. అహ్మదాబాద్-ముంబై తేజస్ను 2020 జనవరిలో ప్రవేశపెట్టారు. ఈ రెండు రైళ్లు వారంలో నాలుగు రోజులు (సోమవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం) నడుస్తాయి.
రైల్వే ప్రయాణికులకు మరింతగా సౌకర్యాలు, క్వాలిటీ ఫుడ్ కోసం ఐఆర్సీటీసీ ప్రైవేటుగా నడుపుతున్న తేజస్ రైళ్లలో ఐదు ఏండ్లు దాటిన పిల్లలకు కూడా పూర్తి టికెట్ చార్జీ వసూలు చేయడంతోపాటు సీటును కేటాయిస్తారు. తేజస్ ఎక్స్ప్రెస్ చార్జీ డైనమిక్ విధానంలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బస్సు, టాక్సీ, రైలు, విమాన ఛార్జీలపై ఇది ఆధారపడి ఉంటుంది. టికెట్ల బుకింగ్లో తత్కాల్ కోటా లేదా ప్రీమియం తత్కాల్ కోటా ఉండవు. కేవలం సాధారణ కోటా, విదేశీ పర్యాటక కోటా మాత్రమే ఉంటాయి.