ఆర్కేపురం : పార్టీలు.. జల్సాలు.. జర్నీలు ఇలా.. కాలాన్ని కాలక్షేపంతో గడిపేస్తున్నారు యువకులు..కానీ.. కొందరు మాత్రం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కష్టాల్లో ఉన్న వారికి వెలుగునీడ అవుతున్నారు. సేవలోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సరూర్నగర్ డివిజన్కు చెందిన రెడ్ఫోర్స్ సంస్థ ప్రతినిధులు ఆ కోవకు చెందిన వారే. సమాజహిత కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తూ..నవతరంలో సేవా భావాన్ని నింపుతున్నారు.
స్నేహితులతో కలిసి..
సరూర్నగర్ చెరుకుతోట కాలనీకి చెందిన రాహుల్ 2014 నవంబర్ 14న రెడ్ఫోర్స్ అనే సంస్థను స్థాపించారు. తన స్నేహితులు మహేశ్, లోకేశ్, శివరాజ్, సాయికృష్ణ, స్నేహ, తేజస్వి, భరత్, నరేందర్, వరుణ్, శివ, సాయితేజులతో కలిసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత ఇవ్వడం, ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం, రహదారుల వెంట నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందజేయడం, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, అంధులకు చేతి కర్రలు ఇలా … ఎన్నెన్నో కార్యక్రమాలతో సమాజహితానికి పాటుపడుతున్నారీ స్నేహితులు. ప్రస్తుతం రెడ్ఫోర్స్ ఎనిమిది జిల్లాల్లో 2500 మంది సభ్యులతో కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.
సేవతోనే ఆనందం..
ఎదుటివారికి సాయం చేయడంలోనే ఆనందం ఉంటుంది. సేవ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. డబ్బు అవసరం లేదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, నిరుపేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూతన్విడం, ఆకలితో అలమటించే వారి కడుపునింపడం.. ఇవే మా లక్ష్యం, ఆశయం. నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. – రాహుల్, రెడ్ఫోర్స్ సంస్థ వ్యవస్థాపకుడు
కార్యక్రమాలివీ..
ఎనిమిది జిల్లాల్లోని గ్రామాల్లో పారిశుధ్యం, ఇతర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు .
చెరుకుతోట కాలనీ ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులకు బ్యాగులు, పేట్లు పంపిణీ.
సరూర్నగర్తో పాటు పలు చోట్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమాల నిర్వహణ, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు.
చాదర్ఘాట్ నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డు వెంట నిద్రిస్తున్న 100 మందికి 100 దుప్పట్లు పంపిణీ. అమ్మ ఫౌండేషన్లో దుస్తులు, విద్యాసామగ్రి అందజేత.
గడ్డిఅన్నారంలో 60 మంది యువతతో రక్తదాన శిబిరం.
చదువు కోసం ఇబ్బంది పడుతున్న అనాథ విద్యార్థులకు ఆర్థిక సాయం
100 మంది అంధులకు కర్రల అందజేత.
గ్రూప్లో సమాచారం ఇస్తే చాలు.. అవసరమున్న వారికి సభ్యుల రక్తదానం.