ప్రతిపాదనలను సిద్ధం చేసిన సింగరేణి సంస్థ
టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు
రోజుకు 180 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తే లక్ష్యం
పెద్దపల్లి, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు సింగరేణి సంస్థ ముందుకు వచ్చింది. రామగుండం ఆర్జీ-1 పరిధిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వైద్య, ఇండస్ట్రియల్ అవసరాలను తీర్చేందుకు సన్నాహాలను ప్రారంభించింది. రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రామగుండం దూర పరంగా మధ్యగా ఉండటంతో సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో ఈ ప్లాంటును ఏర్పాటు చేయనున్నది. ఒక వైపు కొవిడ్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమల సహకారాన్ని తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు గాలి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను గోదావరిఖని ఏరియా దవాఖానలో నెలకొల్పేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.
దీని ద్వారా ప్రతి రోజూ 180 సిలిండర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేయనుంది. నెల రోజుల్లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్లాంటు నిర్మాణానికి అయ్యే వ్యయం, తదితర పనులన్నింటినీ చకచకా సిద్ధం చేస్తున్నది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఏడు డివిజన్లకు ప్రతి రోజూ 30-40 ఆక్సిజన్ సిలిండర్లు అవసరం కాగా, ఈ అవసరాలు తీరడంతోపాటు సింగరేణి ప్రాంతంలోని వైద్య అవసరాలను తీర్చడమే ఈ ప్లాంటు నిర్మాణ లక్ష్యం. రూ. 1.5కోట్లతో నిర్మించే ఈ ప్లాంటు నిర్మాణానికి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో దేశంలోనే మెరుగైన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నిర్మించే జాతీయ స్థాయి సంస్థలతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
ఏడు డివిజన్లు, 11 ఏరియాలు..
అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేపట్టే రామగుండం ప్రాంతం ఏడు డివిజన్లకు కేంద్రం. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల కార్మికుల ఆరోగ్య అవసరాలను తీర్చే అవకాశాలు ఉన్నాయి. గోదావరి అవతలి వైపు శ్రీరాంపూర్, మందమర్రి డివిజన్లు, మరో 50 కిలో మీటర్లు వెళ్తే బెల్లంపల్లి ప్రాంతంలోని గోలేటి గనులుంటాయి. ఇక్కడ నుంచి 80కిలో మీటర్ల దూరంలో భూపాలపల్లి డివిజన్కు చెందిన గనులుంటాయి. ఇలా ఏడు డివిజన్ల పరిధిలోని 11 ఏరియాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. సింగరేణిలోని 46 వేల ఉద్యోగుల్లో 37 వేల మంది ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోనే ఆక్సిజన్ అవసరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సింగరేణి సంస్థ గోదావరిఖనిని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపిక చేసింది.
నెల రోజుల్లో ఏర్పాటుకు కృషి
నెల రోజుల్లోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఆక్సిజన్ ప్లాంటును వినియోగంలోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిఖని ఏరియా దవాఖానలో 230 బెడ్ల సామర్థ్యం ఉండగా ఇందులో 150 బెడ్లను కరోనా రోగుల కోసం కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 41 మంది కొవిడ్ చికిత్స పొందుతుండగా 17 మంది ఆక్సిజన్ను తీసుకుంటున్నారు. దీంతో ప్రతీ రోజు 20 సిలిండర్ల వరకు అవసరం ఏర్పడింది. ఒక్కో సిలిండర్ 8 వేల లీటర్ల వరకు ఆక్సిజన్ను ఇస్తుంది. కొత్తగూడెం, రామకిష్టాపూర్, భూపాలపల్లి, గోదావరిఖని ఏరియా దవాఖానలకు ఇలా ఆక్సిజన్తోపాటు రోజుకు 30 సిలిండర్లు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అవసరం ఉంది. ఈ అవసరాలన్నీ తీర్చేందుకే ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు.
ఉన్నత స్థాయిలో ఏర్పాట్లు
సింగరేణి ఎంతో పెద్ద సంస్థ అయినప్పటికీ ఆక్సిజన్ ప్లాంటులు అందుబాటులో లేవు. సింగరేణి సీఎండీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించేందుకు ఉన్నత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామగుండంలో ఆర్జీ-1 సింగరేణి ఏరియా దవాఖాన ఆవరణలో ఈ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేశాం. అత్యంత వేగవంతంగా నిర్మించేందుకు ఉన్నత స్థాయిలో చకచకా ప్రక్రియ జరుగుతున్నది. వీలైనంత త్వరగా టెండర్లను పిలిచి ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.
-నారాయణ, జీఎం ఆర్జీ-1 గోదావరిఖని