న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: క్రిమినల్ కేసుల విచారణలో పలు అంశాలకు సంబంధించి నిబంధనలను నిర్దేశించే ‘డ్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రాక్టిస్, 2021’ను అన్ని హైకోర్టులు అనుసరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు క్రిమినల్ కేసుల విచారణలో ప్రస్తుత నిబంధనలు, ప్రకటనలు, ఆదేశాలు, ప్రాక్టిస్ పద్ధతుల్లో ఆరు నెలల్లో తగిన మార్పులు చేసి, ప్రకటన జారీ చేయాలని గడువు విధించింది. ఈ మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు, ఇతర మాన్యువల్స్లో మంగళవారం నుంచి ఆరు నెలల్లోపు సవరణలు చేయాలని నిర్దేశించింది. కేంద్రం కూడా తన నియంత్రణలోని దర్యాప్తు సంస్థల మాన్యువల్స్లో ఇదే గడువులోగా తగిన మార్పులు చేయాలని స్పష్టం చేసింది. తాజా ఆదేశాల్లో భాగంగా… కోర్టులు అన్ని క్రిమినల్ కేసుల విచారణ ప్రారంభంలో ‘ప్రాథమిక కేసు నిర్వహణ విచారణ’ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్రభట్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. క్రిమినల్ కేసుల విచారణలో లోపాలకు సంబంధించిన 2017 నాటి సుమోటో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది.
జడ్జీల్లేక హైకోర్టుల్లో సంక్షోభ ం
తగినంతమంది జడ్జీలు లేక హైకోర్టులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నా యని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టుల్లో 40-50 శాతం వరకు ఖాళీలు ఉన్నాయన్నది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 3-4 వారాల్లోగా న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. మరోవైపు, హైకోర్టుల్లో ఆడ్-హక్ జడ్జీలుగా రిటైర్డ్ హైకోర్టు జడ్జీల సేవలను వినియోగించుకునేలా మార్గదర్శకాలు సిద్ధం చేసింది.