Delhi Police | ఢిల్లీ పోలీసులకు స్థానిక సెషన్స్ న్యాయస్థానం తలంటింది. గతేడాది ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో భారీ స్థాయిలో జరిగిన దాడులపై పోలీసుల దర్యాప్తు ‘చాలా పేలవం’గా ఉన్నదని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వినోద్ యాదవ్ మండిపడ్డారు. గతేడాది ఫిబ్రవరి 25న జరిగిన మత ఘర్షణలో యాసిడ్, గ్లాస్ బాటిళ్లు, ఇటుకలు విసిరారని అశ్రఫ్ అలీ అనే వ్యక్తిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ దాడుల కేసు దర్యాప్తుతో భాగస్వామ్యం కావాలని సీబీఐని కోరింది.
‘భారీగా జరిగిన దాడుల కేసుల్లో దర్యాప్తు తీరు చాలా పేలవంగా ఉంది. మెజారిటీ దర్యాప్తు అధికారులు (ఐవోస్) కోర్టు విచారణకు హాజరు కారు. అర్ధసత్యాలతో చార్జిషీట్ దాఖలు చేశాక పోలీసులు దాని ముగింపై గురించి మాత్రమే మాట్లాడం తప్ప ఏమీ స్పందించడం లేదు. పలు కేసుల్లో అభియోగాలు నమోదైన వ్యక్తులు ఇప్పటికీ జైళ్లలోనే మగ్గుతున్నారు’ అని వినోద్ యాదవ్ ఆరోపించారు.
దాడుల కేసుల్లో బాధితులు పోలీసులైనా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. యాసిడ్ దాడి జరిగితే, దాని నమూనా పరీక్షల నిర్వహణ, బాధితుల గాయాలకు కారణాలు తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపడం లేదన్నారు. కోర్టుల్లో కేసులు వాదిస్తున్న ప్రాసిక్యూషన్ న్యాయవాదులకు అసలు వివరాలు వెల్లడించడం లేదని వినోద్ యాదవ్ వెల్లడించారు.