Internet suspend in Kashmir | జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి భారీగా ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు జరుగుతున్నాయని ఆర్మీ తెలిపింది. ఈ నేపథ్యంలో యురి సెక్టార్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాదుల చొరబాట్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదని తమ తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఉగ్రవాదుల చొరబాటు యత్నాల నేపథ్యంలో యురి సెక్టార్ పరిధిలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల సేవలు నిలిపేయడం ఇదే తొలిసారి.
యురి సెక్టార్పై దాడి జరిగి ఐదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉగ్రవాదుల చొరబాటకు ప్రయత్నం జరిగిందని గుర్తించామని ఆర్మీ అధికారులు చెప్పారు. 2016 సెప్టెంబర్ 18న మిలిటరీ కేంద్రంలోని ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు చొరబడి జరిపిన దాడిలో 19 మంది జవాన్లు మరణించారు. అటుపై పాక్ భూభాగంలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత్ సైన్యం లక్షిత దాడులు జరిపిన సంగతి తెలిసిందే.
గత ఫిబ్రవరిలో భారత్, పాకిస్థాన్ సైన్యాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించడం ఇది రెండోసారి. యురి సెక్టార్లో గత 24 గంటలుగా తనిఖీలు జరుగుతున్నాయని 15 కార్ప్స్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు. చొరబాట్లు జరిగాయని గుర్తించామన్నారు.