న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్పై నేడు అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా కొవిన్ యాప్కు సంబంధించిన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్గా జరగనున్న ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే సుమారు 50కిపైగా దేశాలు కొవిన్ యాప్పై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్లో డిజిటల్ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి.
ఇతర దేశాలు తమ టీకా డ్రైవ్ను మెరుగైన మార్గాల్లో నిర్వహించడానికి సహాయపడటానికి, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ను పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. కెనడా, మెక్సికో, పనామా, పెరూ, అజర్బైజాన్, ఉక్రెయిన్, నైజీరియా, ఉగాండా, వియత్నాం, ఇరాక్, డొమినికన్ రిపబ్లిక్, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే కొవిన్ యాప్ వంటి ప్లాట్ఫామ్ను తమ దేశాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ గత జనవరిలో ప్రారంభమైంది. అప్పుడే కొవిన్ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యాక్సిన్కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ యాప్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు టీకా ఇచ్చే సమయం, కేంద్రాలను తెలుసుకోవడం వంటి సేవలను తెలుసుకోవచ్చు.