భువనేశ్వర్, సెప్టెంబర్ 14: జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులను తేనెటీగలతో అడ్డుకొనేందుకు ఒడిశా ప్రభుత్వం సిద్ధమైంది. ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించకుండా అంగుల్ జిల్లాలోని అత్మాల్లిక్ అటవీ డివిజన్లో ఆర్ఈ-హెచ్ఏబీ (రెడ్యూసింగ్ హ్యూమన్-ఎలిఫెంట్ అటాక్స్ యూజింగ్ బీస్) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శశిపాల్ తెలిపారు.‘ఏనుగులు జనావాసాల్లోకి వచ్చే మార్గాల్లో వ్యూహాత్మకంగా తేనెటీగల డబ్బాలు ఏర్పాటుచేస్తారు. డబ్బాలకు కట్టిన తీగలను ఏనుగులు తొక్కగానే అవి తెరుచుకుంటాయి. తేనెటీగలు దాడి చేస్తే.. ఏనుగులు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోతాయి’ అని వెల్లడించారు. ఈ తరహా ప్రాజెక్టు దక్షిణాఫ్రికా, ఇతర పలు దేశాలతోపాటు ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ర్టాల్లో విజయవంతమైందని చెప్పారు. పంటల కాలం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.