న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ ( Delta variant ) కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులను తెలంగాణాలో కనుగొన్నట్లు పేర్కొంది. శుక్రవారం లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో భాగంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు వెల్లడించారు. దేశంలో SARS-CoV-2 యొక్క జన్యు శ్రేణిని పర్యవేక్షించే ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ISACOG) ఈ మేరకు గుర్తించినట్లు తెలిపారు.
దేశంలోని 28 ప్రయోగశాలల్లో కరోనా వేరియంట్లకు సంబంధించిన 58,240 నమూనాలను ISACOG పరీక్షించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. వీటిలో 46,124 నమూనాలను జన్యుపరంగా విశ్లేషించినట్లు వివరించారు. 4172 నమూనాలు ఆల్ఫా వేరియంట్, 217 నమూనాలు బీటా వేరియంట్, ఒక నమూనా గామా వేరియంట్, 17,169 నమూనాలు డెల్టా వేరియంట్, 70 డెల్లా ప్లస్ వేరియంట్లను గుర్తించినట్లు వెల్లడించారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 23 డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడులో 10, మధ్యప్రదేశ్లో 11, చండీగఢ్లో నాలుగు, కేరళ, కర్ణాటకలో మూడు చొప్పున, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో రెండు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ, హర్యానా, ఉత్తరాఖండ్లో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్లు వివరించారు.